ఎల్కతుర్తి, జూన్ 4 : గ్రామాల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ స్పష్టం చేశారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా పెంచికల్పేటలో శనివారం జరిగిన కార్యక్రమానికి పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు, డీపీవో జగదీశ్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సామల జమున అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ సుధీర్కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప దార్శనీకుడని, అందుకే తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పల్లెప్రగతిని రూపొందించారని కొనియాడారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠధామాలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, క్రీడా మైదానాలు, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ర్టానికి 10 స్వచ్ఛభారత్ అవార్డులు రావడమే మన గ్రామాలు అభివృద్ధి చెందాయనడానికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు తీసుకొచ్చి పల్లెలను సస్యశ్యామలం చేశారని వివరించారు. సీఎం కేసీఆర్ సంపదను పెంచి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికి పంచుతున్నారని పేర్కొన్నారు. ఈజీఎస్ కింద రాష్ర్టానికి రావాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
పల్లెప్రగతిలో భాగస్వాములైన పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు సూచించారు. కేవలం పంచాయతీలదే బాధ్యత కాకుండా తమ ఇంటి వలే గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. అనంతరం డీపీవో జగదీశ్ మాట్లాడుతూ గత విడుతల్లో చేసిన పనులను పర్యవేక్షించడమే ఈ పల్లెప్రగతి లక్ష్యమని చెప్పారు.
వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ ప్రారంభించారు. కొద్ది సేపు అధికారులు, జడ్పీ చైర్మన్ వాలీబాల్ ఆట ఆడారు. పల్లెప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, ఎంపీడీవో తూర్పాటి సునీత, ఎంపీటీసీ చెవుల కొమురయ్య, ఎంపీవో విమల, ఏపీవో విజయలక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి రాజ్కుమార్, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ సుభాశ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పెంచికల్పేట గ్రామంలో శ్రీసీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా దర్వాజ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజారి నాగిళ్ల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ మేకల స్వప్న, సర్పంచ్ సామల జమునాసురేశ్రెడ్డి, ఎంపీటీసీ చెవుల కొమురయ్య, ఆలయ నిర్మాణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.