దుగ్గొండి, నవంబర్ 24: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని వరంగల్ తూర్పు డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. దుగ్గొండి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఆమె పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన డీసీపీకీ ఎంపీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలు పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలను అరికట్టి అదుపులో ఉంచాలంటే ప్రతి గ్రామ సెంటర్లో, కాలనీల్లో సీసీ కెమెరాలను తప్పక ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు,గ్రామస్తులకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. రోడ్లపై జరిగే ప్రమాదాలను అరికట్టాలంటే వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సంపత్రావు, వరంగల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై వంగల నవీన్కుమార్, గ్రామ ఉప సర్పంచ్ యాదగిరి సుదాకర్, పోలీస్ సిబ్బంది, మండల వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.