పోచమ్మమైదాన్, మే 31 : వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికైన ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం రోజే రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు గలాటా సృష్టించారు. ఇటీవల వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమించారు. ఈ మేరకు వరంగల్ ఎల్బీ నగర్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికీ వారే ఆధిపత్యం చలాయించే క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో గల్లాలు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరుకుంది. పార్టీ నాయకులు ఎంత వారించినా వినకుండా ఘర్షణకు తలపడ్డారు.
ఇలాంటి ఘర్షణలకు పాల్పడేవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినా ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీగా దూషణ పర్వానికి దిగారు. వరంగల్ తూర్పులో జరిగిన ఇరు వర్గాల ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకుల ముందే కార్యకర్తలు గొడవపడుతూ కొట్టుకోవడంతో సమావేశం రసాభాసాగా మారింది. కొంతమంది కార్యకర్తలు చెప్పులు, పిడిగుద్దులతో దాడి చేసుకోవడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వరంగల్ తూర్పులో తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో నియోజవర్గంలోని కొండా వర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు చాలా వరకు హాజరు కాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు ముఖ్య నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు.