వరంగల్, సెప్టెంబర్ 13 : పన్నుల వసూళ్లలో వేగం పెంచి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్లో పన్నుల వసూళ్ల పురోగతిపై మంగళవారం ఆమె రెవెన్యూ అధికారులతో సర్కిళ్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.88.31 కోట్లు పన్నుల వసూళ్ల లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.35.78 కోట్లు వసూలు చేశారని అన్నారు. మరింత వేగం పెంచాలని అన్నారు. పన్నుల వసూళ్లపై ఆర్ఐల వారీగా సమీక్ష చేస్తామని అన్నారు. లక్ష్యాలను సాధించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కువ బకాయిలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసూలు చేయాలని అన్నారు. ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు కల్పించిన వన్ టైం స్కీంను సద్వినియోగం చేసుకునేలా బకాయిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్వోలు ప్రతి రోజూ రెవెన్యూ సిబ్బంది సేకరించిన పన్నులపై సమీక్ష చేయాలని అన్నారు. వంద శాతం గృహాలకు జియో ట్యాగింగ్ చేసేలా కృషి చేయాలని చెప్పారు. కొత్త అసెస్మెంట్లకు పన్ను మదింపు చేయాలని అన్నారు. పెండింగ్ ఫైళ్లు ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, ఐటీ మేనేజర్ రమేశ్, ఆర్వోలు సుదర్శన్, యూసుఫొద్దీన్, శ్రీనివాస్, షహజాదీ బేగం తదితరులు పాల్గొన్నారు.