హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11 : క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ ఉద్యోగులలో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం పెంపొందుతాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఏ సర్కిల్ జట్టు గెలిచినా అది మన సంస్థ విజయమేనని, ఉద్యోగులందరూ ఒకే కుటుంబంలా భావించి క్రీడా స్ఫూర్తితో, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడాలన్నారు. మంగళవారం నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడాపోటీలను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని వెల్లడించారు. సంస్థలో శ్రమించే ప్రతి ఉద్యోగీ క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. సంస్థలోని ఉద్యోగులందరూ ఒక్కటై పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, స్పోర్ట్స్ కమిటీ మెంబర్లు మాధవరావు, వేణు బాబు, హేమంత్కుమార్, స్పోర్ట్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, సభ్యులు ప్రేమ్కుమార్, యాకుబ్పాషా పాల్గొన్నారు.