హనుమకొండ చౌరస్తా, మార్చి 19: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉగాదిని పునస్కరించుకొని గురువారం ఉదయం 5 గంటలకు మంగళవాయిద్య సేవ, ఉత్తిష్ట గణపతికి పంచామృతభిషేకం, రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించారు. అనంతరం విష్ణు ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచరాత్ర ఆగామనుసారంగా ధ్వజారోహన గావించి.. ఉత్సవాలను శ్రీసూక్త విధానంతో రక్షాబంధనములు నిర్వహించారు. నిరాజన మంత్రపుష్పం ఉగాది పచ్చడి నివేదన, యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి సుదర్శన హోమం ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి-నీలిమ దంపతులు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్య ఆరాధన, ప్రముఖ సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. తిధి, వారనక్షత్ర యోగ కరణాల ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు ద్వాదశ దోషాల ఫలాలు, ఈ సంవత్సరం జరిగే గ్రహ ఫలితాలు వారు వివరించారు.
అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న వలస పైడి, పొట్లపల్లి శ్రీనివాస్, శంకేసి శంకరరావు, మహమ్మద్ సిరాజుద్దీన్, అరుణ కీర్తి పతాక, తిరునగరి నరేందర్, మెరుగు అనురాధ, తాండ్ర చిరంజీవి, వహీద్ గుల్షన్, రామరత్నమాల, బిటవరం శ్రీమన్నారాయణ వంటి కవుల ఉ వాక్చాతుర్యంతో మన దేశపరిస్థితులపై, ప్రకృతిపై పరాభవనామ సంవత్సర ఉగాది కవిత్వాలు వివరించారు. అనంతరం కవులను స్థానిక ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. తాడూరి రేణుక బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకర్శించాయి. సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ర్ట ఉపాధ్యక్షుడు గట్టు మహేష్బాబు, ఓసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ పోలాడి రామారావు, ఆలయ ఈవో డి.అనిల్కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్శర్మ, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, చొల్లేటి కృష్ణమాచారి పాల్గొన్నారు.