హనుమకొండ చౌరస్తా, మార్చి 10: డ్రగ్స్ హిత సమాజానికి విద్యార్థులు కృషి చేయాలని ఎస్పీ అర్.గిరిధర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల (అటానమస్) మంగళవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయని, నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవని, వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోతున్నారన్నారు.
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఏసీపీ పి.నర్సింహరావు మాట్లాడుతూ ఒకసారి డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులు వీటిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికైనా వెనుకాడరన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ కె.సోనీ విద్యార్థులచే మాదక నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని 1908కు ఫోన్ చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్.వెంకన్న, డీవీ ఫణి, రంజిత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఈ.కవిత, రామా రత్నమాల, వి.మమత, ఎన్సీసీ అధికారి బి.సువర్ణ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.