హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఫెస్టివల్ అధికారి రాముల సునీత, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఉత్సవాల వివరాలను వెల్లడించారు.
ఫిబ్రవరి 14న ఉదయం ఐదున్నర గంటలకు ఉత్తిష్టగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం అనంతరం సూర్యాలయంలో ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కల్యాణ బ్రహ్మోత్సవాలు,ఉదయం 11 గంటలకు యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహ రుద్రహోమం 18 అధ్యాయలతో మహా చండీహోమం నిర్వహించనున్నారు. సాయంకాలం భజనలు, తీర్థప్రసాదాల పంపిణీ.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజ్ వెంకటేశ్వర్లు దంపతుల సౌజన్యంతో ప్రారంభ పూజ, ఆదివారం మహాశివరాత్రి పర్వదినం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
శివరాత్రి రోజు ఉదయం 3:30 గంటలకు సుప్రభాతసేవ, మంగళవాయిద్య సేవ.. ఉదయం 4 గంటలకు స్వామికి రుద్రాభిషేకం, చండీ హోమం జరుపుతారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి10 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు, సాయంత్రం 5.45 నిమిషాలకు రుద్రేశ్వరీ-రుద్రేశ్వర స్వామి కల్యాణోత్సవం.. ఉదయం 8 గంటల నుంచి టీటీడీ సహకారంతో భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి.. సుధీర్రావు శిష్య బృందం, తాడూరి రేణుక బృందాలచే నృత్యప్రదర్శన, శివతత్వంపై ఆధ్యాత్మిక ప్రసంగం గారేపల్లి మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగం, బోడిగ లక్ష్మీనారాయణ భాగవత్చే హరికథా కాలక్షేపం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలపూజ 111 రుద్రాలతోని మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
మంగళవారం నాగవెల్లి సదస్యం, బుధవారం మహాఅన్నదానం, 11 మంది వేదపండితుల ఆధ్వర్యంలో లింగోద్భవ కాలపూజ ఉంటుంది. గురువారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకు పూజ, చందనోత్సవం ఐదు రోజులపాటు నిర్వహించే మహా రుద్రయాగం పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డీసీపీ సరిత, ఏసీపీ నరసింహారావు, ఆర్డీవో రమేష్రాథోడ్, ఎమ్మార్వో గుజ్జుల రవీందర్రెడ్డి, ఆలయ ఈవో డి.అనిల్కుమార్, హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ రుద్రేశ్వర సేవాసమితి సభ్యులు చొల్లెట్టి కృష్ణమాచారి, పులి రజినీకాంత్, గండ్రాతి రాజు, మామిడాల గణపతి, కట్ల రాజు, ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మతో కలిసి భారీకేడ్లు, క్యూలైన్ల ఏర్పాట్లు, చలువ పందిళ్లను పరిశీలించారు. లింగోద్భవ పూజ టికెట్ రూ.12,116, చండీ హోమం రూ.3,116, రూ.1,116 చెల్లించి రశీదు పొంది భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొనాలని ఆలయ ఈవో అనిల్కుమార్ తెలిపారు.