హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 9: చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు దేవాలయాన్ని సందర్శించి సమీక్షించారు. మహాశివరాత్రి 15వ తేదీ ఆదివారం రోజు జరిగే మహా పర్వదినానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.అనిల్కుమార్ను ఆదేశించారు. వేసవి ఎండలు ప్రారంభమైనందున చలువ పందిళ్లు ఏర్పాటు చేసి చల్లటి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయాలని, సామాన్య భక్తులకు ధర్మదర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, రుద్రాభిషేకాలు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని వేద పండితులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ జూమ్ మీటింగ్ నిర్వర్తించి రాష్ర్టంలోని 5 వేల శివాలయాల్లో పనిచేస్తున్న ఈవోలకు,అసిస్టెంట్ కమిషనర్లకు, డిప్యూటీ కమిషనర్లకు తగు ఆదేశాలిస్తూ భక్తులకు సౌకర్యాలు కలిగించాలని జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకొని దేవాలయాల్లో ఆధ్యాత్మిక భావన శివతత్వాన్ని ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వర్తించాలన్నారు. పైస్థాయి అధికారుల ఆదేశాలను తప్పకుండా పాటించాలని, అర్చకులు, సిబ్బంది అప్రమత్తంతో ఉండి ఆరాధన భావంతో సేవలందించాలని ఆదేశించారు. సమీక్షలో కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేందర్శర్మ, దేవాలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, ప్రణవ్, మణికంఠశర్మ, కాశి లింగాచారి ఉన్నారు.