బచ్చన్నపేట ఫిబ్రవరి 17 : పితృ దేవతలను స్మరించుకోవడం ఎంతో గొప్ప వరమని పిఎసిఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పులిగిల్ల పూర్ణచందర్ అన్నారు. మంగళవారం పులిగిల్ల రాజయ్య, లక్ష్మి, నరసయ్యల జ్ఞాపకార్థం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యులంత, వారి బంధువుల స్మారకార్థం అన్నదానాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారన్నారు. పదిమంది పేదలకు ఈ రకంగా నైనా సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు.
జీవితంలో ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదని, ఎంతమంది పేదలకు సహాయం చేశామన్నదే ముఖ్యమని అన్నారు. అందుకే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం మహోన్నతమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పులివెందుల అంజయ్య, రామలింగం, పాండురంగం, వీరేశం, రాజేశం, కాశీపతి, దొంతుల రాజు, ప్రవీణ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.