హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24: కాకతీయ యూనివర్సిటీలోని ప్రభుత్వపాలన శాస్త్రంలో ఇచ్చిన తాత్కాలిక అధ్యాపకుల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వపాలన శాస్త్రం పీహెచ్డీ హోల్డర్స్ కేయూ వీసీ ప్రతాప్రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంలకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 ఫిబ్రవరిలో కేయూ పరిధిలోని నిర్మల్ పీజీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఐదు పేపర్లు, హెచ్ఆర్ఎంలో నాలుగు పేపర్లు సుబేదారిలోని పీజీ కళాశాలలోని ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుపునిచ్చారని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం నుంచి 18 మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎలాంటి ఇంటర్వ్యూ, రోస్టర్ పద్దతి పాటించకుండా పీడీఎఫ్ కలిగిన ఐదుగురు వ్యక్తులకు మాత్రమే ఆర్డర్ కాపీలను జారీ చేశారన్నారు. గతంలో 2017లో కూడా ఎలాంటి ఇంటర్వ్యూ, రోస్టర్ పద్ధతి పాటించకుండా నియామకాలు చేపట్టినట్లు వారు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమకు అన్యాయం జరిగిందని, ప్రొఫెసర్లను బెదిరింపులకు గురిచేసి అడ్డదారిలో నియామకాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు వీసీని కోరారు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒక వ్యక్తి నాన్-టీచింగ్ ఉద్యోగిగా చలామణి అవుతూ కాంట్రాక్టు అధ్యాపకుడిగా 16 పీరియడ్ల వర్క్లోడ్తో క్లాసులు తీసుకుంటున్నారని, వెంటనే ఆ 16 పీరియడ్స్ రద్దు చేసి తమకు కేటాయిస్తే న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ పాలనశాస్త్ర విభాగం కనుమరుగవుతుందని, ఈ విభాగాన్ని మహబూబాబాద్ స్టడీ సెంటర్, జనగామ స్టడీ సెంటర్, సుబేదారి మహిళా పీజీ కాలేజీల్లో పునరుద్ధరణ చేయాలని వీసీకి విజ్ఞప్తి చేశారు.
గతంలో ఈ కళాశాలల్లో ఈ సబ్జెక్ట్ ఉందని వీసీకి తెలుపడంతో వీసీ కూడా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వీసీకి వినతిపత్రం ఇచ్చినవారిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాలకు చెందిన పీహెచ్డీ హోల్డర్లు డాక్టర్ సర్దార్, డాక్టర్ భరత్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ రాధాదేవి, డాక్టర్ మమత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నర్సింగమ్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ రజని ఉన్నారు.