హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31 : కులగణన-2027 శాస్త్రీయంగా నిబద్ధతతో జరగాలని లేకపోతే బీసీలకు మరో దశాబ్ద కాలం తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రపంచంలో ఏ గ్రూపుకు జరగని అన్యాయం 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జరుగుతుందని బీసీ ఉద్యమ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ‘ఓపెన్ కాస్ట్ కాలం క్లోజ్డ్ జస్టిస్- ది ఇంజస్ట్రీస్ ఇన్ సెన్సెస్-2027’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సెన్సెస్-2027లో బీసీలకు జరగబోయే అన్యాయం గురించి శాస్త్రీయంగా విశ్లేషించారు.
కులగణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలని, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్టాన్ విధానం అమలు చేయాలన్నారు. జాతీయ జనగణనలో కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించేందు కు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, కుల గణనను కేవలం ఓపెన్-ఎండెడ్ విధానంలో నిర్వహిస్తే ఒకే కులం వివిధ పేర్లు, పర్యాయపదాలు, ప్రాంతీయ మాండలికాలు, ఉపకులాల పేర్లతో నమోదు అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల తుది డేటాలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జరిపిన సెన్సెస్లో ఇదే జరిగిందన్నారు.
మరొకసారి ఓబీసీలు అన్యాయం బారిన పడటానికి సిద్ధంగా లేరని వారు హెచ్చరించారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాలకు ఈ డేటా కీలకం కాబట్టి కులాల నమోదు ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు డాక్టర్ మియాపురం శివుడు, గొల్లపల్లి విద్యాసాగర్, మిట్టకోల చంద్రమౌళి, వెంకట్గౌడ్, పి.ప్రవీణ్, పి.సహజ, ఎలుపుల రమేష్ పాల్గొన్నారు.