హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 19: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని అప్పుడే విశ్వగురువుగా కీర్తించబడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ఎడ్యుస్కూల్ ఆవరణలో ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత పురోభివృద్ధి అవసరమన్నారు.
చైనా వ్యవసాయ రంగంలోకన్నా కూడా పారిశ్రామికరంగ అభివృద్ధితోనే ప్రపంచాన్ని శాసిస్తున్నదని, స్వాతంత్రం వచ్చాక మొదటి ప్రధాని నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశం వ్యవసాయ ఆధారితదేశంగా గుర్తింపున్నా శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలను, పరిశ్రమలను ఏర్పాటు చేశారన్నారు. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు తీసుకువచ్చే ప్రదర్శనలు సృజనాత్మకతతో కూడిన కొత్త ఆలోచనలతో ఉండాలని అప్పుడే మంచి శాస్త్ర, సాంకేతిక రంగానికి బాటలు వేసిన వారవుతారన్నారు.
ఈ సమావేశంలో ఆర్జేడీ డి.సత్యనారాయణరెడ్డి డీఈవో లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మేన శ్రీను, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సెయింట్ పీటర్స్ విద్యాసంస్థలు అధినేత నారాయణరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యు విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఎన్.హరిత, ట్రస్మా జిల్లా అధ్యక్షులు మాదాల సతీష్, సీఎంఓ బద్దం సుదర్శన్ రెడ్డి, హసన్పర్తి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, కాజీపేట ఎంఈఓ మనోజ్కుమార్, కోఆర్డినేటర్లు మహేష్, మన్మోహన్, సునీత, వివిధ కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్ను సందర్శించడానికి మొదటిరోజు హనుమకొండ, ఆత్మకూరు, హసన్పర్తి, శాయంపేట, వేలేరు, భీమదేవరపల్లి, పరకాల మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ విభాగంలో 93 ఎగ్జిబిట్స్, సైన్స్ఫెయిర్లో జూనియర్, సీనియర్ విభాగంలో 222 ఎగ్జిబిట్స్ను విద్యార్థులు ప్రదర్శించారు.