హనుమకొండ చౌరస్తా, జూలై 29 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి పురస్కరించుకొని ఉదయం రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించారు. అనంతరం గ్రామాల నుంచి కొంత మంది రైతులు సమర్పించిన కూరగాయలు, బీర, టమాట, ఆలు, మునక్కాయ, సొరకాయ, వంకాయ, దొండకాయ, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పుదీనా, గుమ్మడికాయ, క్యారెట్, దోసకాయ, గోరుచిక్కుడుకాయ, బిన్నీసు, ప్రకృతి సహజమైన కూరగాయలు తమ పెరట్లో పండించిన వస్తువులను తీసుకువచ్చి క్వింటాల్ కూరగాయలు సమర్పించడం వలన వాటిని రుద్రేశ్వరస్వామికి దండల రూపంలో అలంకరించారు.
శాకంబరునిగా అలంకరించి పంచసూక్తములతో పూజలు నిర్వహించారు. వర్షాలు ప్రారంభమైనందున నాగల్లుబట్టి దుక్కి దున్నే సమయం వచ్చినందున ఆ పరమేశ్వరుని ప్రీతికరంగా పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు మేఘాలను వర్షిస్తున్నందున స్వామివారికి కృతజ్ఞతగా రైతులు సమర్పించిన కూరగాయలతో పూజించడం జరిగిందన్నారు. వర్షం పడుతున్నా భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో దేవాదాయ శాఖ మాజీ కమిషనర్ అనిల్కుమార్, సతీమణి పద్మజ, వరంగల్ వాసి సంగీత కళాకారిని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, ప్రణవ్, శ్రవణ్, రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, ఆంజనేయులు, భునగిరి మాధవరావు, వంశీ కూరగాయలు సమర్పించిన వారిలో ఉన్నారు. ఆలయ ఈవో అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.