హనుమకొండ చౌరస్తా, జూలై 14: కాకతీయ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్లు వెంటనే రాజీనామా చేయాలని ‘లా’ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మంగళవారం సుబేదారిలోని యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణలో ‘లా’ విద్యార్థులు దీక్ష చేపట్టారు. శాంతియుతంగా విద్యార్థులు దీక్ష చేస్తుంటే సుబేదారి పోలీసులు వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తత పరిస్థితి దారి తీసింది. లా విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించలేని వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రాంచంద్రం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్కి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు స్టాలిన్, సందీప్, రాకేష్రెడ్డి, అరుణ్, అజయ్, ఈశ్వర్, సాత్విక్, శ్రీను, పవన్, ఆదిత్య మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల న్యాయవిద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని, ఐదు సంవత్సరాల పాటు వేల రూపాయల రూం రెంట్లను భరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ అధికారుల అసమర్థ పాలనతో హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అణిచివేత తగదన్నారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించడం సరైంది కాదన్నారు. హాస్టల్ వసతి కల్పించేవరకు పోరాడుతామని, కేయూ వీసీ, రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్ల విద్యార్థులపై కక్షసాధింపు, నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.