భీమదేవరపల్లి, జనవరి 03: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం థథి స్నానాభిషేకం కరపత్రాలను ఆలయ చైర్మన్ కాసం రమేష్ (Kasam Ramesh) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి 1,100 కిలోల పెరుగుతో మన్యసూక్త విశేష అభిషేకం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
తోగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి కరతాళముల చేత థథి స్నానాభిషేక కార్యక్రమం జరుగుతుందని ఆలయ చైర్మన్ కాసం రమేశ్ తెలిపారు. అనంతరం స్వామివారి దివ్య ప్రవచనములు, మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు. కరపత్రాల ఆవిష్కరణలో కాసం రమేష్తో పాటు ఆలయ నిర్వాహకులు బొజ్జపురి అశోక్ ముఖర్జీ, గద్ద సమ్మయ్య, గద్ద సంపత్, గౌడ బాలాజీ పాల్గొన్నారు.