Kakatiya University | హనుమకొండ చౌరస్తా, జులై 5: ఈనెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి తెలిపారు. శనివారం కేయూ సెనెట్హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, పరిక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ సమక్షంలో ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు.
స్నాతకోత్సవానికి రాష్ర్ట గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథిగా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరవుతారని వీసీ వివరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ఆర్ట్స్ ఫాకల్టీలో 60 గోల్డ్ మెడల్స్, 56 పీహెచ్డీలు, సైన్స్ ఫాకల్టీలో 161 గోల్డ్ మెడల్స్, 96 పీహెచ్డీలు, ఫార్మసీ ఫాకల్టీలో 48 గోల్డ్ మెడల్స్, 21 పీహెచ్డీలు, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫాకల్టీలో 66 గోల్డ్ మెడల్ లు, 49 పీహెచ్డీలు, సోషల్ సైన్సెస్ ఫాకల్టీలో 88 గోల్డ్ మెడల్స్, 133 పీహెచ్డీలు, ఎడ్యుకేషన్ ఫాకల్టీలో 25 గోల్డ్ మెడల్స్, 18 పీహెచ్డీలు, లా ఫాకల్టీలో 72 గోల్డ్ మెడల్స్, 4 పీహెచ్డీలు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫాకల్టీలో 44 గోల్డ్ మెడల్స్, 10 పీహెచ్డీలు, ఇలా మొత్తం 564 గోల్డ్ మెడల్స్ , 387 పీహెచ్డీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
అకాడమిక్ సెనేట్ సమావేశంతో స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని, అనంతరం గవర్నర్, ముఖ్యఅతిథి, వీసీ, రిజిస్ట్రార్, పూర్వపు ఉపకులపతులు, కంట్రోలర్, డీన్స్, పాలకమండలి సభ్యులు, సెనెట్ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకుంటారని వీసీ చెప్పారు. ఆ తర్వాత సెనేట్ సభ్యుల పొసేషన్ నిర్వహించబడుతుందని, వెంటనే బంగారు పతకాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం ఆడిటోరియంలో జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవ కార్యక్రమం ముగుస్తుందని, ఈ వేడుకను అన్ని విభాగాల సహకారంతో విజయవంతంగా నిర్వహించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కార్యక్రమ నిర్వహణ కోసం ఒక స్టీరింగ్ కమిటీతో పాటు మొత్తం 10 సబ్ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీలో కన్వీనర్, కో కన్వీనర్లతో బాటు 10 మంది సభ్యులు ఉన్నారని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిపి వేసిన ఈ కమిటీలు కష్టపడి స్నాతకోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారని వీసీ తెలిపారు. వివిధ కమిటీలు వారంరోజులుగా పనిచేస్తున్నట్లు వీసీ తెలిపారు.
విద్యార్థిసంఘాలతో వీసీ సమావేశం..
కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించడంతో శనివారం వారితో వీసీ ప్రతాప్రెడ్డి సమావేశమయ్యారు. కేయూ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని ఇప్పటికే విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తుండటం, ఈసీ సభ్యుల దిష్టిబొమ్మ దహనం, రోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండటంతో కేయూ 23వ స్నాతకోత్సవాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని, ఎలాంటి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని వీసీ విద్యార్థులకు సూచించారు.