హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోని, నవ సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు జయరాజ్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు టి.రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘ప్రకృతిని రక్షించుకుందాం.. వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అనే అంశంపై ప్రకృతి వైజ్ఞానిక యాత్ర సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణాన్ని కలుషితం చేసే వస్తువులను వినియోగించడం వలన అనారోగ్యానికి గురవుతున్నారని, దీంతో గాలి, నీరు కలుషితమవుతుందని, ప్రకృతికి హాని కలిగించే వస్తువులను వాడవద్దని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చైతన్యవంతం కావాలని కోరారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశారని, తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని భవిష్యత్తు తరాలు అలాంటి ఇబ్బందులు కలగకూడదని, జీవితాంతం కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పాలకుల విధానాలతో రాజ్యాంగానికి ఆటంకాలు వస్తున్నాయని, రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత అందరి మీద ఉందన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను ఎదుర్కోవడంలో విద్యార్థులు అగ్రభాగాన నిలవాలని, సైన్స్ను ప్రోత్సహించాలని సైన్స్ ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. కేయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమణ, వైస్ ప్రిన్సిపాల్ వి.మహేందర్, మహిళా హాస్టల్స్ డైరెక్టర్ సుమలత, అవయదానం జాతీయ అధ్యక్షుడు, విజ్ఞానదర్శిని రాష్ర్ట కార్యదర్శి ఎండి.అలీ, అధ్యక్షుడు ఆదంరాజ్, టిపిటిఎల్ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి విజయ్, రైల్వే యూనియన్ నాయకుడు యాదవరెడ్డి, కేయూ పరిశోధక విద్యార్థులు దొగ్గెల తిరుపతి, బోస్క నాగరాజ్, జనగాం రాజారాం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, కేయూ అధ్యక్ష, కార్యదర్శులు సాయికుమార్, బీరెడ్డి జస్వంత్, అశోక్, బి.ప్రవర్ధన్, శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.