హనుమకొండ/హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27 : ఓరుగల్లు నివాసయోగ్యమైన ప్రాంతమని, హనుమకొండ, వరంగల్ నగరాలను హైదరాబాద్కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, ‘నమస్తే తెలంగాణ’ అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్. సురేందర్రావు ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చీఫ్విప్ మాట్లాడారు. సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. వరంగల్కు హైదరాబాద్కంటే గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళికలతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ను అమలు చేయడం ద్వారా భవన నిర్మాణం, వెంచర్ల అనుమతులు సులభతరమయ్యాయని తెలిపారు. ఓరుగల్లు నగరం ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం, హెల్త్ హబ్గా మారడంతో పాటు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. అధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తున్న ఓరుగల్లుకు రింగ్ రోడ్డు సౌకర్యం కలుగడంతో నగరం చుట్టూ కిలోమీటర్ల మేర వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్ల కల్చర్ రూపుదిద్దుకున్నదన్నారు. హైదరాబాద్ తరహా ప్రగతి పుంతలు తొక్కుతున్న ఓరుగల్లులో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని చెప్పారు. ఇక్కడివారే కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల వారు కూడా వచ్చి స్థిరపడాలని చూస్తుండడం శుభపరిణామమన్నారు. అనేక భవన నిర్మాణ రంగ సంస్థలు నగరాభివృద్ధికి కృషి చేస్తున్నాయని, కొత్తగా మరిన్ని సంస్థలు కూడా రావాలని ఆకాంక్షించారు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లకు ప్రాపర్టీ షో మంచి వేదిక అని అభివర్ణించారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను అద్భుతంగా నిర్వహించి నగరాభివృద్ధిలో పాలుపంచుకోవడం అభినందనీయమని కొనియాడారు.
అత్యంత వేగంగా వరంగల్ అభివృద్ధి
వరంగల్ చారిత్రక, సాంస్కృతిక నగరమని, హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, దేశంలోనే వైవిధ్యమైన నగరంగా వెలుగొందుతున్నదని నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో సాంకేతికతను జోడించి టీఎస్ఐపాస్, టీఎస్బీపాస్ను తీసుకువచ్చి పారదర్శకంగా, అత్యంత సులభంగా నిర్మాణ అనుమతులు ఇస్తున్నదని చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీతో 12 నుంచి 18 నెలల్లో పెద్దపెద్ద బిల్డింగ్లు కడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ వెస్ట్సైడ్ మాత్రమే విస్తరిస్తున్నదని, కానీ వరంగల్లో 360 డిగ్రీస్లో అంతటా విస్తరిస్తున్నదని వివరించారు. ఏరియా డెవలప్మెంట్, ఫైనాన్స్ గురించి ఆలోచించి సామాన్యులు నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నీ ఆలోచించే కన్స్ట్రక్షన్, బ్యాంకు రుణాల వివరాలను కొనుగోలుదారులకు సులభతరం చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ప్రధాన ఆర్థిక స్థిరత్వం కోసం అభివృద్ధి చెందుతున్న నగరంలో సామాన్యుల సొంతింటి కల నెరవేర్చేందుకు ఈ వేదికను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక్క చోట చేరడం కొనుగోలుదారులకు సువర్ణావకాశమన్నారు.
– ఎన్. సురేందర్రావు,నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్
నగరాభివృద్ధికి భారీగా నిధులు
వరంగల్ మహానగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నారని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఓరుగల్లు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. సామాన్యుల సొంతింటి కల నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అభినందనీయమన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే వేదికపై తెలియజేసేలా ప్రాపర్టీ షో నిర్వహణ మంచి ఆలోచన అన్నారు. వరంగల్ ఇప్పటికీ గ్లోబల్ సిటీల్లో స్థానం సంపాదించిందని, ఇటీవల కూడా నగరాన్ని అవార్డులు వరించాయని చెప్పారు. వరంగల్ నగరంలో ఐటీ, టెక్స్టైల్ పార్కులు రావడంతో ప్రగతికి మంచి బాటలు పడ్డాయన్నారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
– మేయర్ గుండు సుధారాణి