హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి, వరంగల్ పురపాలక ప్రథమ అధ్యక్షుడు స్వర్గీయ తిరువరంగం హయగ్రీవాచారి పేదల పెన్నిధి అని, వరంగల్ నగరాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ అన్నారు. హయగ్రీవాచారి జయంతి సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జంక్షన్లోని ఆయన కాంస్య విగ్రహానికి సుందర్రాజ్తోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ రావుల సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ హయగ్రీవాచారి విద్యాపరంగా ముందుచూపుతో నగరంలో మెడికల్ కాలేజీ, జూనియర్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇప్పించి, ఎడ్యుకేషన్ హబ్గా చేశారని కొనియాడారు. అజీజ్ఖాన్ మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో హయగ్రీవాచారి ముందుండి ఆదుకున్నారన్నారు.
వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారన్నారు. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు బిల్ల అడవయ్య, కొమురయ్య, వెంకటరాంనర్సయ్య, హనుమకొండ మల్లయ్య, మాజీ కౌన్సిలర్ హెచ్ రాజేందర్, గోపు సారయ్య, రైల్వే పింఛన్ ఎన్ఎఫ్ఐఆర్ గౌరవాధ్యక్షుడు వడ్నాల నగేశ్, అందె గణేశ్బాబు, మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, ఎస్ విద్యాసాగర్, రిటైర్డ్ హెచ్ఎం కేవీ రంగారెడ్డి, కార్పొరేటర్ గుంటి రజితా శ్రీనివాస్, మంద పరమేశ్వర్, ఎర్ర రామకృష్ణ, తుమ్మనపెల్లి వీరన్న, జక్కోజు మోహన్ తదితరులు పాల్గొన్నారు.