హనుమకొండ, నవంబర్ 25 : కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. కేవలం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు డిసెంబర్ 8లోగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చాన్స్ ఇచ్చింది. అర్హులు ceotelangana.in, http://nvsp.inలో లేదా రెవెన్యూ డివిజన్ అధికారికి, తహసీల్దార్ కార్యాలయం, బీఎల్వోలకు పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలి. అయితే ఇప్పటికే 104 పరకాల, 105 వరంగల్ పశ్చిమ నియోజక వర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొత్తం 4,67,432 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఓటర్ల పేర్లు, చిరునామా లాంటి తదితర మార్పులుచేర్పులు ఏమైనా ఉంటే చేసుకునేందుకు వీలు కల్పించారు. కొత్తవారు ఫారం-6లో వివరాలు నింపాలి. దరఖాస్తుకు పదో తరగతి మారుల మెమోతోపాటు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా జతచేయాలి. శని, ఆదివారం, డిసెంబర్ 3,4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు. జనవరి 5న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.
అందుబాటులో బీఎల్వోలు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు శని, ఆదివారం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 3,4 తేదీల్లో కూడా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. బీఎల్వోలు ముసాయిదా ఓటరు జాబితా కాపీలతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాలో జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఫారం -6 ద్వారా నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలి. అలాగే, 2023 ఏప్రిల్ 1, 2023 జూలై 1, 2023 అక్టోబర్ 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండేవారు ముందస్తుగానే ఫారం-6 లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అలాగే, ఓటరు జాబితాలో పేర్లు, తప్పులను సరి చేసుకునేందుకు, చిరునామా మార్పు, ఓటరు జాబితాలో పీడబ్ల్యూడీ ఓటర్ల వైకల్యం మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అదేవిధంగా ఓటరు జాబితా నుంచి పేరు తొలిగించేందుకు ఫారం-7 ద్వారా (మరణించిన వారు, డబుల్గా నమోదైనవారు, పూర్తిగా వెళ్లిపోయినవారు) దరఖాస్తు చేసుకోవాలి. 104 పరకాల, 105-వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల ప్రజలు బూత్ లెవల్ అధికారుల వద్ద గల ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, తగిన దరఖాస్తులు అందజేసేందుకు భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. అర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు..
జిల్లాలో 104 పరకాల, 105 వరంగల్ పశ్చిమ నియోజక వర్గాలు ఉన్నాయి. స్పెషల్ సమ్మరి రివిజన్-2023 ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 479 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 4,67,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 2,35,690, పురుషులు 2,31,507, థర్డ్ జెండర్ 12, సర్వీస్ ఓటర్లు 223 మంది ఉన్నారు. కాగా, పరకాల నియోజక (104) వర్గంలోని 238 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,03,789 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,00,122 మంది పురుషులు, 1,03,512 మంది మహిళలు, ముగ్గురు థర్డ్ జెండర్స్, 152 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అదే విధంగా వరంగల్ పశ్చిమ (105) నియోజక వర్గంలోని 241 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,63,643 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,31,385 మంది పురుషులు, 1,32,718 మంది మహిళలు, 9 మంది మంది థర్డ్ జెండర్స్, 71 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.