హనుమకొండ/పోచమ్మమైదాన్, ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆదివారం ఉమ్మడి వరంగల్ నుంచి ఏడుగురు చేనేత కార్మికులు రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఇందులో వరంగల్ కొత్తవాడ నుంచి బైరి స్వరూప (దర్రీస్), పరికిపండ్ల రాంబాబు, వీరబత్తిని రమేశ్, వల్లాల మల్లయ్య, అలాగే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మామిడి సమ్మయ్య(హిమ్రూ చీరలు), ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వేముల సమ్మయ్య(ఆర్మూర్ చీరలు), జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన పాము రమేశ్(పోచంపల్లి ఇక్కత్చీరలు)లను ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి సన్మానించి ప్రశంసించారు. వీరికి అవార్డుతో పాటు రూ.25వేల చెక్కు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. అలాగే గతంలో జాతీయస్థాయి చేనేత అవార్డు అందుకున్న కొత్తవాడ నేత కార్మికుడు పిట్ట రాములును కూడా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నేత కార్మికులను అవార్డులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని, ఇది తెలంగాణ చేనేతకు గర్వకారణమని పేర్కొన్నారు.