సుబేదారి, ఏప్రిల్ 27 : ప్రముఖుల సభలు, సమావేశాలను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను సీపీ తరుణ్జోషి వెల్లడించారు. హైదరాబాద్కు శివరాంపల్లికి చెందిన హతగాడే రవి, మహేశ్, ఉప్పల్కు చెందిన కమ్లెబాబు అలియాస్ ఉప్పాడే అనిల్, మోహిదీపట్నానికి చెందిన ఎస్కే ఖైసర్పాషా, నాంపల్లికి చెందిన సచిన్ప్రకాశ్ ఉపాధ్యాయ, ఆసిఫ్నగర్కు చెందిన పల్లెల సురేశ్ ముఠాగా ఏర్పడ్డారు. రాజకీయ ముఖ్య నాయకుల సభలు, సమావేశాలను టార్గెట్గా చేసుకుని జేబు దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరలో ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటన వివరాలు ముందే తెలుసుకున్న ముఠా సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి రెండు చోట్ల జేబు దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రేటర్ కార్యాలయంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఓ బాధితుడి జేబు నుంచి రూ.15 వేల నదును హతగాడే రవి, హతగాడే మహేశ్, కమ్లే బాబు, పల్లెల సురేశ్ కొట్టేశారు. తర్వాత సాయంత్రం హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన సభలో మరొకరి జేబు నుంచి ఖైసర్, సచిన్ ప్రకాశ్ ఉపాధ్యాయ రూ.15వేలు తస్కరించారు.
అయితే టార్గెట్ పూర్తికాకపోవడంతో ముఠా సభ్యులు వరంగల్లోనే మకాం వేశారు. వరంగల్, హనుమకొండ బస్స్టేషన్లు, మట్టెవాడ, సుబేదారి పోలీస్ స్టేషన్, రద్దీ ప్రాంతాలను టార్గెట్గా ఎంచుకున్నారు. బుధవారం అనుమానస్పదంగా కనిపించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. గతంలో వీరంతా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జేబు దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించినట్లు సీపీ తరుణ్జోషి వెల్లడించారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన క్రైమ్స్, ఆపరేషన్ డీసీపీ పుష్పారెడ్డి, క్రైమ్ ఏసీపీ డేవిడ్రాజ్, సీసీఎస్ సీఐ రమేశ్కుమార్, ఎస్సై సంపత్కుమార్, యాదగిరి, సిబ్బందిని సీపీ అభినందించారు.