హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని వేయి రోజులు గడిచాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, హామీలో నెరవేరిచే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు.
ఈనెల 2 నుంచి 8 వరకు ప్రతి రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 2న 420 హామీలు బ్యానర్లపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, 3న రైతుల హామీలపై కాజీపేట జంక్షన్ లో ధర్నా, 4న హనుమకొండ చౌరస్తాలో వంటా వార్పు, 5న ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ, ధర్నా,
6న ఇంజన్ సెంటర్లో ఆటోలో డ్రైవర్లతో నిరసన, 7న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజావాణిలో వినతులు సమర్పణ, 8న కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయడం పై నిరసన చేయనున్నట్లు తెలిపారు.
షాదీ ఖానా స్థలాన్ని మైనార్టీలు సాధించుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మిషన్ హాస్పిటల్ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలి. రీల్స్ చూసి కాదు రియల్ లైఫ్ లా పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదన్నారు. ప్రతిపక్షంపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. నంది పంది, అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.