హనుమకొండ చౌరస్తా, జూలై 6: ఓరుగల్లు ప్రజల హృదయాల్లో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మంచి మనసున్న నాయకుడు ప్రణయన్న అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సోమవారం 10వ డివిజన్ పద్మాక్షిగుట్ట వద్ద ఉన్న లెప్రసీ కాలనీలో దాస్యం ప్రణయ్భాస్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రణయ్భాస్కర్ చిత్రపటానికి పూల వేసి నివాళులు అర్పించారు. ప్రణయ్భాస్కర్ జోహార్లు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రణయ్భాస్కర్ ఆశయ సాధనలో ముందుకెళ్తు న్నామని, ప్రణయ భాస్కర్ కృషి మరువలేనిదన్నారు. పేద ప్రజల పెన్నిధి ప్రణయ్న్న, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా వినిపించిన తెలంగాణ వాది ప్రణయ్భాస్కర్ అని అన్నారు. నాటి హనుమకొండ నియోజకవర్గప్రజల యోగక్షేమాలను, అభివృద్ధిని సమ ప్రాధాన్యతతో నడిపిన నాయకుడు ప్రణయ్ భాస్కర్ అని అన్నారు. అనంతరం పండ్లు, ఆహార పదార్థాలు అందజేశారు.
కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, నాయకులు ఖలీల్, రఘు, హైమావతి, వరుణ్, సారంగం, అనిల్, ఖాజా, సందీప్, నందా, కాలనీ వాసులు పాల్గొన్నారు.