హనుమకొండ చౌరస్తా, జనవరి 4: కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పీడీఎస్యూ రాష్ర్ట అధ్యక్షుడు కాంపాటీ పృథ్వీ అన్నారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్హౌస్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) కేయూ 12వ మహాసభ బి.బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని సమీక్షించి, అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. పాలకులు విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాలే ధ్యేయంగా సంస్కరణలు తీసుకువస్తూ పేద వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు.
పాలకుల విధానాల ఫలితంగా హై స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ విద్యారంగం అనేక సమస్యలతో సతమతమవుతూ సంక్షోభంలో కూరుకుపోతున్నదన్నారు. రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నతవిద్యకు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వాలు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం విద్యార్థులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పీడీఎస్యూ పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి, కేయూ అధ్యక్షుడు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య, రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, రాష్ర్ట నాయకులు బి.అజయ్, పి.అనూష, కేయూ ఉపాధ్యక్షుడు గణేష్, వంశీ, సహాయ కార్యదర్శులు లోకేష్, కోశాధికారి సంగీత ప్రసంగించారు. అనంతరం 17 మందితో పీడీఎస్యూ కాకతీయ యూనివర్సిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు.