హనుమకొండ చౌరస్తా, జూలై 14 : హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) ఆవరణలోని స్పోర్ట్స్ స్కూల్ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్స్కూల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి చదువు, క్రీడా శిక్షణ, వసతి, ఆహార సౌకర్యాలు తదితర అంశాలపై హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంతను అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లోనే కాకుండా విద్యలోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేసి వారిని ప్రోత్సహించారు. తర్వాత స్పోర్ట్స్స్కూల్లోని వసతి గృహాలు, మెస్ సౌకర్యాలు, భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. క్రీడా గ్రౌండ్లు, జిమ్నాస్టిక్స్ హాల్, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్పూల్, అథ్లెటిక్స్ స్టేడియంను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, క్రీడా మౌలిక వసతులు, మెస్ నిర్వహణ, వసతి సౌకర్యాల గురించి డీవైఎస్వో ప్రశాంత్ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణ, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, వివిధ క్రీడాంశాల్లో కల్పించిన సౌకర్యాలు, విద్యార్థులు సాధిస్తున్న విజయాల గురించి కలెక్టర్కు వివరించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన శిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ టీచర్లు, డిఎస్ఏ కోచ్లు, స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు