ఖిలా వరంగల్, మార్చి 16: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు. సోమవారం తూర్పు కోట అంగన్ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణీలకు 99 రోజుల ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ చిన్నారుల నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గర్భిణులకు పోషకాహారం అందించడం, చిన్నారులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తూ పాఠశాల అలవాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
అలాగే ఆటలు, పాటలు, బొమ్మలతో పిల్లల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి పాఠశాలలు, కాలేజీలు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ చివరకు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగం బడి ప్రధానోపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు స్వర్ణ, వహీదా, శోభ, రాజమణి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.