హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: రాష్ర్టంలో పాలిటెక్నిక్ వ్యవస్థను శక్తి శాఖలో కలుపుతూ స్కిల్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు వెలువరించిన జీవో 97లో సవరణలు చేస్తామని ఇటీవల అసెంబ్లీ వేదికగా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ర్ట ఛైర్మన్ మేకల అక్షయ్కుమార్ గుర్తుచేశారు. 97 జీవోలో అభ్యంతరాలపై చర్చించి సవరణలు చేయడం విషయమై పాలిటెక్నిక్ వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు జరిపి నివేదిక అందించాలన్నారు. 30రోజుల గడువుతో ప్రభుత్వం జీవో 1239 ద్వారా నియమించిన హై లెవల్ కమిటీ నిర్ణీత కాలవ్యవధి ముగియడానికి వస్తున్నా నేటికీ రాష్ర్టంలోని పాలిటెక్నిక్ వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు జరిపి నివేదిక రూపొందించడంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఈమేరకు శుక్రవారం వరంగల్ ప్రభుత్వ కో-ఎడ్ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ హై లెవల్ కమిటీ నిర్లక్ష్య పనితీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. హై లెవల్ కమిటీ పాలిటెక్నిక్ వ్యవస్థ భాగస్వాములతో చర్చలు పూర్తిచేసి రాష్ర్ట ప్రభుత్వానికి త్వరగా తుదినివేదిక అందజేయాలని, రాష్ర్ట ప్రభుత్వం జీవో 97లో సవరణలు చేసి స్కిల్ యూనివర్శిటీలోకి శక్తి శాఖలోకి పాలిటెక్నిక్ విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.
లేనిపక్షంలో పాలిటెక్నిక్ వ్యవస్థ భాగస్వాములందరూ పాలిటెక్నిక్ వ్యవస్థ పరిరక్షణకు పెద్దఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ ఓల్డ్స్టుడెంట్ దొడ్డిపల్లి కుమార్, పేరెంట్ గాజుల విజయ్, ప్రభుత్వ కో-ఎడ్, మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులు భానుప్రకాశ్, త్రిశ్, పవన్, శ్రుతి, పవిత్ర, స్పందన, కారుణ్య, అక్షిత పాల్గొన్నారు.