Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. కారు బాంబు పేలడంతో 16 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని, ఓల్డ్ పోలీస్ లైన్స్లో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. శుక్రవారం ఉదయం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు పదార్థాలతో ఉన్న ఒక కారు అక్కడి పోలీస్ లైన్స్ గేటు వద్దకు దూసుకొచ్చి, పేలిపోయింది.
ఈ పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. మొత్తం 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. మసీదు పక్కనే ఈ పేలుడు జరిగింది. దీంతో మసీదు కూడా భారీగా దెబ్బతింది. మసీదు గోడలు కూడా కూలిపోయాయి. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్తానిక పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కోహట్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మొత్తం 25 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనతో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారా అనే కోణంలో ప్రాంతం మొత్తాన్ని గాలిస్తున్నారు. రోడ్డు మార్గాన్ని పూర్తిగా మూసేసి, తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ పేలుడు ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. కారణం ఏంటి అనే అంశాలపై విచారణ జరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.