హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12 : తెలంగాణ ప్రభుత్వం వారసత్వ శాఖ, పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్, హనుమకొండ చరిత్ర విభాగం మధ్య బుధవారం హైదరాబాద్లో వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు ఆఫీసులో అవగాహన ఒప్పందం కుదిరిందని కాలేజీ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి తెలిపారు. వారసత్వ స్థలాల సంరక్షణ, పురావస్తు అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం, పరిశోధన, ప్రాయోగిక శిక్షణకు అవకాశాలు కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులను వారసత్వ స్థలాల సందర్శనలు, పరిశోధన కార్యక్రమాలు, శిక్షణ, సదస్సులు, ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు.
వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు మాట్లాడుతూ పింగళి కళాశాల చరిత్ర విభాగం విద్యార్థినులు వారసత్వ, పురావస్తు అధ్యయనాలపై ఆసక్తి చూపుతున్నారని, విద్యార్థులకు శిక్షణ, ఇంటర్న్షిప్ అవకాశాలు, మ్యూజియంల సందర్శనలు, సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం, పరిశోధనా నైపుణ్యాలు పెరగడంతో పాటు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు విద్యాసంస్థల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందన్నారు. చరిత్ర విభాగాధిపతి కొలిపాక శ్రీనివాస్, ఐక్యూఏసీ సమన్వయకర్త సురేష్బాబు, యూజీసీ సెల్ సమన్వయకర్త బాలరాజు, వారసత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, మల్లు నాయక్ ఉన్నారు.