నమస్తే తెలంగాణ నెట్వర్క్ : పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గీసుగొండ మండలంలోని మరియపురం శివారు వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో, హనుమకొండ జిల్లాలోని అదాలత్ ఎదుట ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దివ్యాంగుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ ఆధ్వర్యంలో బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్, మహదేవపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, మహాముత్తారం మండలం యామన్పల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి బస్టాండ్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పేపర్ లీకేజీ సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్కు విద్యార్థుల ఉసురు తగులుతుందన్నారు. జనగామ జిల్లాకేంద్రంలో జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే సంపత్రెడ్డి నిరసనలో పాల్గొని బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.