పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరూ కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని సూచించారు. మారుమూల ప్రాంతాలు, స్లం ఏరియాలతో పాటు అన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారుండకూడదని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ నుంచి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా వైద్య సిబ్బంది చూడాలని తెలిపారు.
అనంతరం వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి వివరాలు, వేయించుకోని వారి సంఖ్యను, ఇందుకు గల కారాణాలను తెలుసుకున్నారు. అలాగే వ్యాక్సినేషన్ రికార్డు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాశ్, ఎన్యుహెచ్ఎం రంజిత్, డాక్టర్ రవీందర్, సీనీయిర్ డీపీవో శ్రీనివాస్, డీపీవో అర్చన పాల్గొన్నారు.