Warangal | పోచమ్మమైదాన్, మే 29: వరంగల్ నగరంలో నాలుగేళ్లు బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని విషయం కలకలం రేపింది. కన్న కొడుకు అని చూడకుండా డబ్బుల కోసం తండ్రి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలో దిగారు. వివరాలిలా ఉన్నాయి.
కరీమాబాద్కు చెందిన మసూద్ తన నాలుగేళ్ల కుమారుడు అయాన్ను అమ్మాడని అదే ప్రాంతానికి చెందిన అతడి బావమరిది అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు బాలుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా తండ్రి మసూద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే తన కొడుకును అమ్మలేదని, పోచమ్మమైదాన్లో ఉన్న కుటుంబ సభ్యులకు పెంపకం కోసం ఇచ్చానని మసూద్ చెబుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఈ కేసు మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్ నుంచి మట్టెవాడ స్టేషన్కు బదిలీ అయినట్లు తెలుస్తోంది.
కుటుంబసభ్యులకు తెలియకుండా కన్నతండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇతను పిల్లలను పట్టుకునే ముఠా సభ్యులకు డబ్బుల కోసం అమ్మి ఉండవచ్చని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ బాలుడిని పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాకు అప్పజెప్పారా, లేక సంతానం లేనివాళ్లు పెంపకం కోసం తీసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై లోతుగా విచారించాలని పోలీసులను సీపీ ఆదేశించినట్లు తెలుస్తోంది.