పోచమ్మమైదాన్, మార్చి 29: వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటకు తెలంగాణ స్టేట్ గురుకుల మైనార్టీ బాలికల పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల(1) ఏర్పాటు కానుంది. ఈ మేరకు నూతన భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించాలనే సంకల్పంతో అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భవన సముదాయం పనులను ప్రారంభించారు. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని మైనార్టీ బాలికల కోసం ప్రత్యేకంగా 2016 సంవత్సరంలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసింది. అప్పట్లో వరంగల్లో వసతులు లేని కారణంగా చింతగట్టు ప్రాంతంలో అద్దె భవనంలో నిర్వహించారు. ఈ క్రమంలో బాలికలకు గురుకుల పాఠశాల దూరం కావడంతో 2019లో కేయూ క్రాస్ సమీపంలోని అద్దె భవనంలో నిర్వహణ చేపట్టారు. జిల్లా బాలికల అవసరాల దృష్టా పాఠశాలతోపాటు ఉన్నత విద్య కోసం జూనియర్ కళాశాలను కూడా 2020 సంవత్సరం నుంచి అందుబాటులో తీసుకొచ్చారు. దీంతో పాఠశాల నుంచి కళాశాల విద్య వరకు మైనార్టీ బాలికలు చదువుకునే అవకాశం ఏర్పడింది. అయితే, హనుమకొండ ఏరియాలో అద్దె భవనంలో నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలను వరంగల్ తూర్పులో సొంత భవనంలో ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు.
ఏడేళ్ల నుంచి అద్దె భవనంలో కొనసాగుతున్న మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, కశాశాలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం నుంచి రూ. 5 కోట్ల మంజూరు కావడంతో నూతన భవన నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. దీంతో దేశాయిపేటకు హనుమకొండలో ఉన్న గురుకుల పాఠశాల, కళాశాలను తరలించనున్నారు. ఇందుకు అవసరమైన నూతన భవన నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జీ+3 అంతస్తుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్+ఫస్ట్ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తి కాగా, సెకండ్ ఫ్లోర్ పనులు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో సొంత భవనంలోకి గురుకులాన్ని తీసుకురావాని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ దేశాయిపేటలో రెసిరెన్షియల్ స్కూల్, కాలేజీని నిర్వహించడం వల్ల విద్యార్థుల సంఖ్య చాలా వరకు పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులకు ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. వీరి కోసం 480 సీట్లు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు, 160 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీ, బీపీసీ సీట్లను కేటాయించారు. ఇందులో 75 శాతం మైనార్టీ బాలికలు, 25 శాతం ఇతరులు చదువుకోవడానికి ప్రవేశాలు ఉంటాయి. అలాగే, ప్రస్తుతం రంగశాయిపేటలో అద్దె భవనంలో ఉన్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల(2)లో కూడా ఇదే తరహాలో చదువుకునే అవకాశం ఉంది. అయితే, ఇంటర్మీడియట్లో మాత్రం ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉంటాయి. దీంతో వరంగల్ తూర్పులో మైనార్టీ బాలికలు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.