అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారుల హోదాలో కలెక్టర్లు బుధవారం తుది జాబితాను వెల్లడించగా శాసనసభ నియోజకవర్గాలవారీగా మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషులు, థర్డ్ జెండర్ ఓట్ల వివరాలు ఉన్నాయి. మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వారీగానూ ఈ వివరాలను పొందుపరచగా, ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన బాబితాతో పోలిస్తే సగటున ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 5 శాతం దాకా ఓటర్లు పెరిగారు. తుది జాబితా విడుదల కావడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు.
వరంగల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో కీలకమైన ఓటర్ల జాబితా తయారైంది. జిల్లా ఎన్నికల అధికారుల హోదాలో కలెక్టర్లు బుధవా రం తుది జాబితాను వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషులు, థర్డ్ జెండర్ ఓటర్ల వివరాలు ఉన్నాయి. మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వారీగానూ ఈ వివరాలను పొందుపరిచారు. స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, ములుగు, హుస్నాబాద్, హుజూరాబాద్, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. భద్రాచలం సెగ్మెంట్లో మహిళల ఓటర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నది. ఈ సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 1,44,118 మంది ఉన్నారు. వీరిలో 74,794 మహిళా ఓటర్లు, 49,321 పురుష ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల పరంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది బాబితాతో పోల్చితే సగటున ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి ఐదు శాతం వరకు ఓటర్లు పెరిగారు. వీరిలో 18 ఏండ్లు నిండి కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఎక్కువగా ఉన్నారు.
ఇక మొదలు..
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటరు తుది బాబితా తయారు కావడంతో ఇక అసలు ప్రక్రియపై ఆసక్తి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. అసెం బ్లీ నియోజకవర్గాల వారీగా నియమితులైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ప్రతి రోజు ఇదే ప్రక్రియలో నిమగ్నమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి రేషనలైజేషన్, పోలింగ్ కేంద్రా ల్లో వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. దివ్యాంగ ఓటర్లు, వృద్ధుల కోసం అవసరమైన వసతులను కల్పించేందుకు కింది స్థాయి వారితో సమన్వయం చేసుకుని పని చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుందనే సమాచారంతో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేస్తున్నారు.