ఖిలావరంగల్, నవంబర్ 23 : ఢిల్లీ, కర్ణాటక నుంచి వచ్చే పోలిటకల్ టూరిస్టులతో కలిగే ప్రయోజనం శూన్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లి, బొల్లికుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా వచ్చారు. ఖమ్మం ప్రధాన రహదారి నుంచి బొల్లికుంట వరకు యువత భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంపై పక్కా ప్రణాళికలు లేని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని అన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. సమర్ధవంతమైన పాలనను అందిస్తున్న కేసీఆర్ను ప్రజలు దీవించాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం, అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మరోసారి గెలిపిస్తే రాబోయే తరానికి కూడా బంగారు బాటలు వేస్తానన్నారు.
అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఎమ్మెల్యే చల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దె బాబు, ఖిలావరంగల్ పీఏసీఎస్ వైస్ చైర్పర్సన్ సోల్తీ భూమాత, నాయకులు కత్తెరపల్లి దామోదర్, జన్నుపాల రాంబాబు, సోల్తీ నరేందర్ పాల్గొన్నారు.
గాడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే చల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీపై, నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి పరకాలలో గులాబీ జెండా సత్తా ఏంటో చాటాలన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు మెంబర్ జంగ కుమారస్వామి, కొత్తపల్లి అయిలయ్య, బట్టమేకల కిరణ్, రమేశ్, గాలి రవి, పసునూరి ఉప్పల్ స్వామి, కడిదెల విజేందర్, పసునూరి కుమార్, మేకల స్వామి, పసునూరి పవన్, గువ్వల ఆర్య, రాపాల సంజన్, పసునూరి నవీన్, ఐత రవి, గొల్లపల్లి నాగరాజు, నవీన్, తాళ్లపల్లి నాగరాజుతో పాటు మరో 50 మంది ఉనారు.
సంగెం : కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువై పక్క నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకున్నారని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం మండలంలోని పెద్దతండా, షాపురం, సా యంత్రం లోహిత, సోమ్లాతండా, తీగరాజుపల్లి, రాత్రి కుంటపల్లి, సంగెం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోల్లో మాట్లాడారు. పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో నర్సంపేటలో రెండు సార్లు ఓడిపోయి పశ్చిమ నియోజకవర్గం వచ్చాడని, అక్కడి ప్రజలు తరిమికొడితే నర్సంపేటకు మళ్లీ వాపస్ పోయాడని, ఇప్పుడు పరకాల నియోజకవర్గానికి వచ్చాడని, అలాంటి నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. తాను 10 ఏండ్లుగా ప్రజలకు అండగా ఉన్నానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించాలన్నారు. తాను ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కష్టాల్లో తోడుగా ఉంటానని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్కు గిరిజనులు అండగా నిలబడాలన్నారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు రవి, సట్ల రాజు, కర్జుగుత్త రమ-గోపాల్, మంగ్యా నాయక్, కావటి వెంకటయ్య, గుండేటి బాబు, ఎంపీటీసీలు అడ్డగట్ల దుర్గారావు, రంగరాజు నర్సింహస్వామి, మెట్టుపల్లి మల్లయ్య, నాయకులు కందకట్ల నరహరి, సొసైటీ చైర్మన్లు సంపత్గౌడ్, వేల్పుల కుమారస్వామియాదవ్, మాజీ ఎంపీపీ వీరాచారి, దొనికెల శ్రీనివాస్, కోడూరి సదయ్య, పులి వీరస్వామి, మునుకుంట్ల కోటేశ్వర్, అప్పె నాగార్జున శర్మ, ఉప సర్పంచ్ కక్కెర్ల శరత్ పాల్గొన్నారు.