సందడి చేసిన చిత్ర బృందం
వేదికపై మెరిసిన సాయిపల్లవి, రాణా
ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అట్టహాసంగా ఆత్మీయ వేడుక
ఇక్కడి నుంచి వచ్చిన సిన్మా సక్సెస్ : మంత్రి ఎర్రబెల్లి
సినిమా వరంగల్కు అంకితం : దర్శకుడు వేణు
హనుమకొండ, జూన్ 12: నగరంలో విరాటపర్వం సినిమా టీమ్ ఆదివారం సందడి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆత్మీయ వేడుక ఆదివారం రాత్రి హనుమకొండ సుబేదారిలోని కాలేజీ మైదానంలో జరిగింది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో కామ్రేడ్ రవన్నగా రాణా దగ్గుపాటి, వెన్నెలగా సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి, నవీన్చంద్ర నటించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వరంగల్ జిల్లాకు చెందిన సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించగా, చంద్రబోస్, మిట్టపల్లి సురేందర్, జిలుకర శ్రీనివాస్ ఈ సినిమాకు సాహిత్యం అందించారు.
వరంగల్కు రావడం అంటే తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని సాయిపల్లవి, వరంగల్ నగర ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివని రాణా తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ వరంగల్ నుంచి ఏ సినిమా ప్రారంభించినా సక్సెస్ అవుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ సినిమా షూటింగ్లకు ఓరుగల్లు పరిసరాలు అనువుగా ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాను వరంగల్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ప్రకటించారు. ఎంపీ పసునూరి దయాకర్, సురేశ్ బొబ్బిలి, శ్రీకాంత్, సుధాకర్, తరుణ్భాస్కర్, వెంకట్, నటుడు నవీన్చంద్ర పాల్గొన్నారు.