ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఫలితాలు
పల్లెప్రకృతి వనాలకు రూ.256 కోట్లు
రూ.9,566 కోట్లు జీపీ ఖాతాల్లో జమ
యువత కోసం క్రీడా ప్రాంగణాలు
పారిశుధ్య పనులతో వ్యాధులు దూరం
రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శరత్
లింగాలఘనపురం, పాలకుర్తి, మరిపెడ మండలాల్లో పర్యటన
లింగాలఘనపురం/ పాలకుర్తి రూరల్/ మరిపెడ, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో పల్లెలు కొత్తకళను సంతరించుకున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ శరత్ అన్నారు. ఆదివారం ఆయన జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, పాలకుర్తి మండలం దర్దేపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొనగా, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో తండధర్మారం గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుగులోతు అరుణ ఆయనకు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శరత్ పంచాయతీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, పారిశుధ్య పనులను సర్పంచ్ లక్ష్మీలక్పతి, పంచాయతీ కార్యదర్శి నరేశ్ను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలో నిల్వ ఉన్న నిధులు ఎంత అని అడుగగా రూ.11లక్షలు ఉన్నట్లు కార్యదర్శి చెప్పారు. నెల్లుట్లలో అర్బన్ పార్కు, నర్సరీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాల కోసం రాష్ట్రంలో రూ.256 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
యువత కోసం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు గ్రామాల్లో ఇప్పటి వరకు 2 వేల మైదానాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్లెప్రగతిలో గ్రామంలో చేపట్టిన పనులను ప్రజలకు తెలియజేస్తూ, నిరంతరం పారిశుధ్య పనులు మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. పచ్చదనాన్ని పెంపొందించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. గతంలో వానకాలం వచ్చిందంటే ప్రజలు అంటు, సీజనల్ వ్యాధులతో దవాఖానల పాలయ్యేవారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పల్లె ప్రగతిలో డ్రైనేజీలు, పాడు బడిన బావులను పూడ్చి వేశామన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్ యార్డు లు, సెగ్రిగేషన్ షెడ్లు పూర్తయినట్లు చెప్పారు. అభివృద్ధి పనులకు పారదర్శకంగా నిధులు వినియోగించుకోవాలన్నారు. పంచాయితీలకు వచ్చిన నిధులు, వ్యయంపై సమాచార సూచీని ఉంచి ప్రజలకు జవాబుదారీ పాలన అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు రూ.9,566 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల చేసిందన్నారు. ప్రతి నెలా విడుదల చేసే రూ.256 కోట్ల నిధులు ఆయా పంచాయతీలకు విడుదల చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి బాధ్యతలను పంచాయతీరాజ్పై పెట్టినందున అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు.
ప్రభుత్వ తోడ్పాటుతో జాతీయ స్థాయి 20 అవార్డుల్లో 19 అవార్డులు తెలంగాణకు రావడం సం తోషంగా ఉందన్నారు. మెరుగైన పనితీరుతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సత్ఫాలితాలు సాధించాలన్నారు. హరితహారంతో రాష్ట్రంలో 7.7శాతం పచ్చదనం మెరుగుపడిందన్నారు. 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. జీపీకి పదివేల మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ ఆరుమొక్కలు అందించి సంరక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీపీవో రంగాచారి, మండల స్పెషలాఫీసర్ లత, ఎంపీడీవో సీతారాంనాయుడు, ఎంపీవో మల్లికార్జున్, నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపరాణి, మండల వైద్యాధికారి కరుణాకర్, పశువైద్యాధికారి అనిత, పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాస్రెడ్డి, కారోబార్ కృష్ణస్వామి, మహబూబాబాబాద్ డీపీవో సాయిబాబా,డీఆర్డీఓ సన్యాసయ్య, డిప్యూటీ సీఈఓ నర్మద, ఎంపీడీవో కేలోతు ధన్సింగ్, అధికారులు పూర్ణచందర్ రెడ్డి, మంగమ్మ, పంచాయితీ కార్యదర్శులు లెనిన్, రామోజీ, శ్రీలత, సరిత, లత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.