తొర్రూరు, మే 8 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, తండా కార్యదర్శి గుగులోత్ రాజును గ్రామస్తులు నిలదీశారు. సోమరపుకుంట తండాకు మంజూరైన 10 ఇందిరమ్మ ఇండ్లను 5 నుంచి 7 ఎకరాల భూమి కలిగిన కాంగ్రెస్ నేతలకే కేటాయించారని, నిజంగా ఇండ్లు లేని పేద గిరిజనులకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నాయకుడి కింద పనిచేసే వర్గానికి కూడా ఇండ్లు కేటాయించారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ‘ఇందిరమ్మ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సభ్యులెవరు? ఎంపికలు ఏ ఆధారాల మీద చేశారో చెప్పండి’ అంటూ తండావాసులు అధికారులను నిలదీశారు. వారికి సమాధానం ఇవ్వలేక డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, కార్యదర్శి గుగులోత్ రాజు అకడి నుండి వెళ్లిపోయారు. నిలదీసిన వారిలో రాజ్కుమార్, తిరుపతి, చంద్రశేఖర్, వెంకన్న, యాకమ్మ, అనిల్, సురేశ్, సునీల్, బాలూనాయక్ ఉన్నారు.