జయశంకర్ భూపాలపల్లి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఉద్యోగాల దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఉద్యోగాల పేరుతో దందా’ కథనానికి వారు స్పందించారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఏజెన్సీలు, దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన తతంగంపై ఆరా తీస్తున్నారు. బాధితుల వద్దకు వెళ్లి ఎవరెవరికి ఎంత డబ్బులు అందజేశారనే విషయమై వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కళాశాలల్లో ఇప్పటికే చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాలపై కూపీ లాగుతున్నారు. వంద పడకల జిల్లా ఆస్పత్రి, కలెక్టరేట్, మెడికల్ కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీ సంస్థలు, దళారులు నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. కలెక్టరేట్, మెడికల్ కళాశాలతో పాటు పలు కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని స్పార్క్ అండ్ సాయినాథ్ ఏజెన్సీ ప్రొప్రైటర్ ఎండీ ఖాజాపాషా తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు జీ మల్లీశ్వరి, జీ మహేందర్, బీ లక్ష్మీనారాయణ, తిరుపతి, జీ రవీందర్, భద్రయ్య, రాజు, సంపత్, రాజేశ్వరి, సుమతి, సది తదితరులు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కాగా, స్పార్క్ అండ్ సాయినాథ్ ఏజెన్సీతో పాటు మరో సంస్థ నిర్వాహకులు, దళారుల దందాపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.