హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీలు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారనే ఆవేదనతో మనస్థాపం చెందిన బీసీల ముద్దుబిడ్డ సాయి ఈశ్వరచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం హనుమకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ టైలర్స్ట్రీట్లో దివంగత సాయి ఈశ్వరచారికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ సాయిఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే నైతిక బాధ్యత వహించాలన్నారు.
ఇది ముమ్మాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యగానే బీసీ సమాజం పరిగణిస్తుందన్నారు. హత్యకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వరాచారి మృతితోనైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగం ద్వారా 9వ, షెడ్యూల్లో నేర్పించి, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని వెంటనే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయకుంటే, బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాయి ఈశ్వరాచారి ఆత్మ త్యాగంతోనైనా కాంగ్రెస్, బిజెపి పార్టీలలోని బీసీ నేతలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిసి జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ బోనగాని యాదగిరిగౌడ్, జిల్లా స్వర్ణకార సంఘ ఉపాధ్యక్షలు కొత్తగట్టు వీరబ్రహ్మచారి, తెలంగాణ రాష్ర్ట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు పెందోట చక్రపాణి, రాష్ర్ట కార్యదర్శులు పొడిచెట్టి విష్ణువర్ధన్, కట్కోజ్వల సత్యనారాయణ, జక్కోజు కోటేశ్వర్రావు, స్వర్ణకార సంఘం నాయకులు, కార్యకర్తలు పానుగంటి రవీందర్, ఆసం రవి, మధు, శ్రీను, శ్రీధర్, మనోజ్కుమార్, శ్రీనివాస్, సురేష్, రమేష్ పాల్గొన్నారు.