జఫర్గఢ్, ఆగస్టు 17 : భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన వేల్పుగొండ లక్ష్మీనరసింహుడు జాతరకు ముస్తాబయ్యాడు. ఏటా శ్రావణంలో నిర్వహించే ఈ ఉత్సవాలు, ఈనెల 19 నుంచి జనగామ జిల్లా జఫర్గఢ్లో అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మండల కేంద్రంలోని పడమటి కొండపై స్వయంభువుగా వెలిసిన లక్ష్మీ నరసింహుడి ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వరంగల్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జఫర్గఢ్లో వేల్పుగొండ లక్ష్మీ నరసింహుడిని జాతర సందర్భంగా దర్శించుకునేందుకు సమీప ప్రాంతాల వారే కాకుండా, ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలు, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కోరిన కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకుంటారు. కొండ వరకు వివిధ వాహనాల్లో వచ్చి కాలినడకన కొండ ఎక్కాల్సి ఉంటుంది. దర్శనానికి ముందు కోనేరులో స్నానాలు చేసి, తలనీలాలు సమర్పించుకుంటారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తారు.
ప్రకృతి రమణీయం.. వేల్పుగొండ
పూర్వం ఆగస్త్య మహాముని వింధ్య పర్వత గర్వమణిచి దక్షిణా పథం వైపు వెళ్లే సందర్భంలో ఈ కొండపై గుహలో లక్ష్మీ నరసింహుడిని ప్రతిష్ఠించుకొని తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతున్నది. నాటి నుంచి అనేక మంది రుషులు, మునులు, దేవతలు ఇక్కడ తపమాచరించారని, ఈ క్రమంలో స్వామి వారు లక్ష్మీ సమేతంగా కొండను చీల్చుకుని అదే గుహలో స్వయంభువుడిగా వెలిశాడని ప్రతీతి. రుషులు, మునులు, దేవతలు(వేల్పులు) తపమాచరించినందున ఈ కొండ ‘వేల్పు’గొండగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రదేశం ప్రకృతి రమణీయతతో అలరారుతున్నది. కొండపై నుంచి చూస్తే పచ్చని వాతావరణం కనువిందు చేస్తుంది. జాతరకు వచ్చే భక్తులు ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతుంటారు. చారిత్రక ప్రాంతమైన జఫర్గఢ్ గుట్టపై నాటి నవాబులు, కాకతీయుల కట్టడాలు కనిపిస్తాయి. బురుజులు, ఫిరంగులు, కోట నిర్మాణాలు అబ్బురపరుస్తాయి. కొండపై సహజ సిద్ధంగా వెలసిన ఏడు కోనేరులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆలయం ఎదుట ఉన్న కోనేరు, అక్క చెల్లెళ్ల గుండంగా పిలిచే మరో కోనేరులో ఎప్పుడూ నీరుంటుంది.
సకల వసతులు కల్పించాం
భక్తుల కోసం కొండపై సకల వసతులు కల్పించాం. గుహలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశాం. శ్రావణ మాసంలో ప్రతి శనివారం మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తాం. భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– కొత్వాల కుమార్, ఆలయ చైర్మన్