నయీంనగర్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలో గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు, కాలనీవాసులు కోలాటం ఆడుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్, కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని, సీఎం కేసీఆర్కు ప్రజల ఆదరణ ఉందని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. దేశంలోని రాష్ర్టాలు మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్రం తన స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు వివరించాలని అన్నారు. మతతత్వ పార్టీలను దగ్గరకు రానివ్వకుండా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. రైతుల కోసం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కట్టి నీళ్లను అందిస్తుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం రూపాయి సాయం చేయకుండా నిందలు వేస్తోందని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన సూచించారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. త్వరలో ఇల్లు లేని ఆర్థిక సాయం అందజేస్తామని, జాగలు లేని వారికి ప్రభుత్వ భూముల్లో పక్కా గృహాలు కట్టి ఇస్తామని, దళితులకు దళిత బంధును అందజేస్తామని అన్నారు. గ్రేటర్లో విలీనమైన 33 గ్రామాలను ఎంతోగానో అభివృద్ధి చేశామని, మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను అందచేసి గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఆత్మీయ సమ్మేళనంలో గాయకులు వర్ధన్నపేట గడ్డపై గులాబీ జెండా… బలగం.. అన్న బలగం.. అరూరి రమేశ్ అన్న బలగం.. యువకుల గుండెల్లో అరూరి అనే పాటను ఆలపించారు. దీంతో కుర్చీల్లో కూర్చున్న మహిళలు, కాలనీ వాసులు స్టేజీపైకి చేరుకుని నృత్యం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్లు జక్కుల రజిత, మునిగాల సరోజన, అరుణ, నాయకులు మణీంద్రనాథ్, లోకిని చందర్, చింత రమేశ్, భుక్యా సాంబయ్య, దూలం రాజేందర్, మహేందర్, రోకుల సందీప్, కల్యాణ్నాయక్, పవన్, వెంకటేశ్వర్లు, శంకర్, శోభారాణి, సరోజన, రాజేశ్, పార్టీ హసన్పర్తి మండల అధ్యక్షుడు బండి రజినీకాంత్ పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భర్తను కాపాడాలని జవహర్కాలనీకి చెందిన ఆంజనేయులు భార్య మహేశ్వరి ఎమ్మెల్యేను కోరింది. ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న సమయంలో ఆమె ఎమ్మెల్యే అరూరి రమేశ్ను వేడుకుంది. తమకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, కూలి పనిచేస్తేనే తన కుటుంబం గడుస్తోందని చెప్పింది. చలించిపోయిన ఎమ్మెల్యే అరూరి రమేశ్ వెంటనే సోమవారం ఉదయం తన ఇంటికి రావాలని, ఆంజనేయులు పూర్తి వివరాలను తీసుకున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ డాక్టర్లతో మాట్లాడి ఆంజనేయులు పరిస్థితిని వివరించారు.
డివిజన్లోని ఎన్జీవోస్ కాలనీలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. కానీ, ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఏమి లేవు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారంతో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ కాలనీని అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది. మా కాలనీ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వైపే మా కాలనీ వాసులు. – మురళీధర్రెడ్డి,
ఎన్జీవోస్ కాలనీ అధ్యక్షుడు
డివిజన్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్ నిధులను మంజూరు చేశారు. ప్రజల సమస్యలు తెలిపితే వెంటనే స్పందించి ఏమి కాదు వారికి నేనున్నాను అంటూ ఎన్నోసార్లు భరోసా కల్పించారు. ఇలాంటి నాయకుడు ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. డివిజన్ వాసులు బీఆర్ఎస్పై ఎంతో సంతోషంగా ఉన్నారు.
– సిరంగి సునీల్ కుమార్, కార్పొరేటర్
గోపాలపురంలోని ద్వారకాసాయికాలనీలో గతంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా ఉండేవి కావు. ముఖ్యంగా వర్షాకాలంలో మహిళలు, చిన్నపిల్లలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటే ఎంతో భయంగా ఉండేది. ఎక్కడ చూసినా బురద ఉండడంతో ఇబ్బంది పడేవారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంతలా అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉంది.
– సతీశ్, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్,ద్వారకాసాయి కాలనీ
మా పెద్ద కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాం. ఆరు నెలల్లోనే ఎటువంటి పైరవీలు లేకుండా కల్యాణలక్ష్మి చెక్కును ఇంటికే పంపించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్తో ఏనాడు నాకు ముఖ పరిచయం లేదు, కానీ, సమస్యలు ఉన్నాయి అని ఫోన్లో చెబితే వెంటనే స్పందించి అనేక సార్లు పరిష్కరించారు. ఇటువంటి పాలకుల మధ్య ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. ఆసరా పెన్షన్ కూడా దరఖాస్తు చేయగానే మంజూరు చేశారు.
– రంగారావు, పరిమళ కాలనీ
ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఒకరోజు మా కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్కు ఫోన్ చేసి ఈ కాలనీలో రోడ్డు సరిగ్గా లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఉన్నారు. వెంటనే ఇక్కడ రోడ్డు వేసే మార్గం చూడు అని రాత్రి 11గంటలకు ఫోన్ చేసి చెప్పారు. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోరుకుంటాడు అనేది ఇందుకు ఉదాహరణ. ఒక కాలనీ కార్యకర్తగా రావడం సంతోషంగా ఉంది.
– పుల్లా శ్రీనివాస్,
కేయూ ప్రొఫెసర్, వెంకటేశ్వర కాలనీ