మద్యం తాగి కారు స్టీరింగ్ పడితే నడువకుండా ఎలా చేయాలి..? ఎంతటి ఎత్తు కలిగిన భవనమైనా దాని కొలతలు ఎలా తీసుకోవాలి…? ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారులను అతితకువ సమయంలో బయటకు ఎలా తీయాలి..? రాకెట్లను విశ్వంలోకి పంపే సందర్భంలో వాతావరణ కాలుష్యాన్ని ఎలా నివారించాలి..? తదితర నమూనా ప్రయోగాలను విద్యార్థులు అద్భుతంగా చేసి చూపించారు. మరుగున పడుతున్న కళలు, జానపద రూపాలు, నృత్య రీతులపైనా అవగాహన కల్పించారు. మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికలు)లో జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే అరూరి రమేశ్ గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 59 గురుకులాలకు చెందిన బాలబాలికలు 118 ఎగ్జిబిట్లను ప్రదర్శనకు ఉంచారు.
– మడికొండ, నవంబర్ 24
మడికొండ, నవంబర్ 24: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనను మడికొండలోని బాలికల గురుకుల కళాశాలలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గురువారం ప్రారంభించారు. జోన్-2 పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని 59 గురుకులాల నుంచి విద్యార్థులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. ‘బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్’, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’, ‘సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’, ‘ఆర్ట్ అండ్ లిటరేచర్’, ‘మ్యాచ్ ఇన్ ఎవ్రీ డే లైఫ్’ అనే అంశాలపై 118 ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారు. బాలబాలికలకు వేర్వేరు క్యాంపస్లలో వసతి కల్పించారు. ఇతర పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి ఎగ్జిబిట్లను తిలకిస్తున్నారు.
సకల కళా రూపాలు
తెలంగాణ సంసృతీసంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు సకల కళా రూపాలు ప్రదర్శించారు. మరుగుపడుతున్న బుర్రకథ, ఒగ్గు కథ, హరికథ, యక్షగానం, గరిటె భాగవతం, సాధనాశూరులు తదితర కళలు, జానపద రూపాలను ఏర్పాటు చేశారు. సుమారు 160కి పైగా ఉన్న ఫోక్ ఆర్ట్స్లో 40 వరకు కళలను ప్రదర్శించారు. రాబోయే జనరేషన్కు వీటి గురించి తెలియజేయడం కోసం పలు రకాల ఆర్ట్స్ల ను రూపొందించారు.
విద్యార్థులు: భూమిక, హర్షిత, షైనీ , గైడ్ టీచర్: జి. జ్యోతి -మడికొండ
తెలంగాణలో విద్యకు పెద్దపీట : అరూరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, ఇందులో భాగంగా కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను రాష్ట్రంలో నడిపిస్తున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగంలో తెచ్చిన మార్పులను తల్లిదండ్రులు, మేధావులు గమనించాలని కోరారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థల్లో విద్యార్థులు సీటు పొందేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులు, గైడ్ టీచర్లను నగరంలోని పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎగ్జిబిట్లను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గురుకులాల సంస్థ జాయింట్ సెక్రటరీ సుక్రు నాయక్, కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ వేణు, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ దువ్వ నవీన్, ఆర్సీవో విద్యారాణి, మెదక్ ఆర్సీవో నిర్మల, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి, డీసీవో దాసరి ఉమామహేశ్వరి, ఏఆర్సీవో రాధాకృష్ణ పాల్గొన్నారు.
కట్టడాల కొలతలు సులభంగా గుర్తించేలా..
ఎత్తయిన నిర్మాణాలు, బిల్డింగులు, టవర్ల హైట్, యాంగిల్ వంటివి గుర్తించడం కోసం ఈ పరికరాన్ని తయారుచేశారు. భవనాలు, కట్టడాల ఎత్తు, కోణం, వాటి విలువలు, కొలతలను సులభంగా గుర్తించడం సాధ్యపడుతుంది. కేవలం న్యూస్ పేపర్ సాయంతో దీన్ని రూపొందించారు.
విద్యార్థులు: ప్రసన్న లత, లక్ష్మీప్రసన్న
గైడ్ టీచర్: ప్రసన్న లక్ష్మి, చొప్పదండి
డ్యాన్స్, మ్యూజిక్ షో
మరుగునపడుతు న్న బాంద్రా, కథక్, భరతనాట్యం, కూచిపూడి, పేరిణి, విలాసిని, ఒడిస్సీ, మోహిని, కథాకళి, గూమర్ వంటి డ్యాన్స్లను ప్రదర్శించారు. వీణ, వయోలిన్, సితార్, కంజర, ఫ్లూట్, పియానో, బిగిల్ వంటి మ్యూజికల్ పరికరాలను ఏర్పాటు చేశారు. దేశంలోని ఒకో రాష్ట్రంలో ఒకో విధమైన కల్చర్ ఉంటుంది. ఆయా సంస్కృతీసంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
విద్యార్థులు: అశ్విత, శ్రేహన్సి , గైడ్ టీచర్లు: షీలా, జ్యోతి, భీమారం, హనుమకొండ
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ
రహదారులపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కారులో అలహాల్ గుర్తించే సెన్సార్ ఏర్పాటు చేసినట్లయితే మద్యం సేవించి వాహనం నడిపేటప్పుడు అది గ్రహిస్తుంది. దీంతో వాహనాన్ని కదలకుండా చేయగలుగుతుంది. ఇలాంటి టెక్నాలజీని వాడినట్లయితే ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే రోడ్ సేఫ్టీ నియమాలను గుర్తించేలా ఎగ్జిబిట్ను తయారు చేశారు.
విద్యార్థులు: ఎం. అక్షయ, బి. కరుణ రేచర్
గైడ్ టీచర్: ఉష -హిస్నాపూర్, సంగారెడ్డి
పొల్యూషన్ లేకుండా రాకెట్ ప్రయోగం
రాకెట్లను విశ్వంలోకి పంపించేటప్పుడు వాటి నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. హైడ్రోజన్, గ్యాస్, ఆక్సిజన్ వంటివి వినియోగించడం వల్ల వాతావరణం పొల్యూషన్ అవుతుంది. ఇలా కాకుండా స్పిరిట్ను ఉపయోగించి లైటర్ ద్వారా స్పార్ ఇస్తే అందులో గ్యాస్ రియాక్టర్ జరిగి అతివేగంగా పైకి వెళ్తుంది. అలాగే యుద్ధాలు జరిగేప్పుడు దూరంలో ఉంటే టార్గెట్ను ఛేదించేందుకు అనువుగా మిస్సైల్ వెపన్ సైతం రూపొందించారు. దీన్ని కూడా స్పిరిట్ను ఉపయోగించి తయారుచేశారు.
విద్యార్థులు: పీ రవీందర్, కే పరశురాములు
గైడ్ టీచర్: సత్యప్రకాశ్, సైనిక్ సూల్, రుక్మాపూర్, కరీంనగర్
బోరు బావి ప్రమాదాల నివారణకు..
బోరు బావిలో నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోరుబావిలో పడిన పిల్లలను అతితకువ సమయంలో బయటకు తీయవచ్చు. ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో బెలూన్లోకి ఎయిర్ ప్రెజర్ పంపించి చిన్నారులను ప్రాణాలతో రక్షించవచ్చు.
విద్యార్థులు: ఎం ధనుష్, ఎం మనోజ్
గైడ్ టీచర్: స్వప్న, కొండపాక, సిద్దిపేట