హనుమకొండచౌరస్తా/ స్టేషన్ఘన్పూర్/ రఘునాథపల్లి/ గీసుగొండ/ ధర్మసాగర్/ కాశీబుగ్గ, డిసెంబర్ 29 : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ ఆదేశించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే గ్రేటర్ 15వ డివిజన్ గొర్రెకుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.
అలాగే ధర్మసాగర్ మండల పెద్దపెండ్యాల, ధర్మసాగర్ గ్రామాల్లో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో జవహర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించగా, వాకాటి కరుణ ఆయా గ్రామాలను సందర్శించారు. కాశీబుగ్గ 14వ డివిజన్ బాలాజీ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించారు. గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అధికారులతో కౌంటర్లు, ఇతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీ, అశ్విని తానాజీ వాకడే, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ విజయ్కుమార్, నోడల్ అధికారి మేన శ్రీను పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్, గోవర్ధనగిరిలో..
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రంతోపాటు రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ఆమె తనిఖీ చేశారు. దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాకాటి కరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ రెండో రోజు జిల్లాలో 38 గ్రామ పంచాయతీల్లో, జనగామ మున్సిపల్లోని నాలుగు వార్డుల్లో దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పర్మర్ పింకేష్కుమార్, డీసీపీ సీతారాం, ఆర్డీవో వాసం రామ్మూర్తి, డీఏవో వినోద్కుమార్, ప్రజా పాలన అదనపు ప్రత్యేకాధికారి సుగుణాకర్ రాజు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.