నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 20 ;మామిడాకుల తోరణాలు, బెలూన్లతో అలంకరించిన పాఠశాలలు, ప్రారంభోత్సవానికి ముస్తాబైన కొత్త తరగతి గదులు, డిజిటల్ క్లాస్రూములు, ఆవరణలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, త్రివర్ణ జెండారెపరెపలు, బడిబాట ర్యాలీలతో ఊరూరా తెలంగాణ విద్యా దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూపుదిద్దుకున్న ‘కొత్త’బడులు ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు అందించారు. అలాగే రాగిజావ పంపిణీని ప్రారంభించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు, ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా విద్యా దినోత్సవం పండుగలా జరిగింది. పాలకుర్తిలో బాలుర డిగ్రీ కళాశాల, స్టేషన్ఘన్పూర్ మండలం రంగరాయగూడంలో అంగన్వాడీ పాఠశాలతో పాటు పెద్దవంగర మండలంలో పలు పాఠశాలలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించి, రాగిజావ పంపిణీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్లు శివలింగయ్య, శశాంక పాల్గొన్నారు. మహబూబాబాద్లో జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి సత్యవతి పాల్గొని సైన్స్ ఫెయిర్ స్టాళ్లను పరిశీలించారు. హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొనగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. టేకుమట్లలో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. గోవిందరావుపేటలో మన ఊరు-మన బడి పనులను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. నర్సంపేటలోని హన్మాన్దేవల్ పాఠశాలలో సంబురాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని పుస్తకాలు అందించారు. వరంగల్ శంభునిపేట స్కూల్లో ఉత్సవాల్లో ఎమ్మెల్యే నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.