హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 23;యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి కరంటు సరఫరా నిలిచిపోయింది. చెట్లు రోడ్లపై విరిగి పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని బోజెర్వు గ్రామం, హనుమకొండలోని హౌసింగ్ బోర్డు, నందిహిల్స్ కాలనీలు జలమయమయ్యాయి. పిడుగుపడి ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో ఒక బర్రె మృతిచెందింది. కమలాపూర్ మండలం అంబాలలో ఇల్లు, గూడూరులో రేకులషెడ్డు నేలమట్టమైంది.
వరంగల్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 4.45 గంటల నుంచి గంటపాటు ఉరుములు, మెరుపులతో కురిసింది. పలుచోట్ల రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నర్సంపేటలో వరద పారింది. కోత దశలో ఉన్న వరి పొలాలు ఈదురుగాలులు, అకాల వర్షంతో నేలకొరిగింది. వడ్లు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కజొన్నలు, మిరప కాయలు తడిశాయి. మామిడి కాయలు నేలరాలాయి. నర్సంపేట మండలం గురిజాలలోని అరటితోటలకు వంగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పలు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. నేలకొరిగాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు.
ఇళ్లలోకి చేరిన వరద
చెన్నారావుపేట: మండల వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలోని పంప్ హౌస్ కోసం వేసిన విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. బలమైన గాలులకు వరిపంట నేలకొరిగింది. మామిడి కాయలు నేల రాలాయి. మండలంలో ఆదివారం సాయత్రం వడగళ్ల వాన కురిసింది. పలుచోట్ల రోడ్ల ఉన్న చెట్లు నేలకొరిగాయి. మండల కేంద్రంలోని ముదురు కల్యాణ్ ఇంట్లోకి వరద నీరు చేరి సామగ్రి మునిగింది. మండలంలోని బోజెర్వు గ్రామంలో వీధులన్నీ జలమయమయ్యాయి. అనేకమంది ఇళ్లలోకి నీరు చేరింది.
ఖానాపురం మండలంలో..
ఖానాపురం: మండలంలో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వరిపంట నేలవాలింది. కొద్ది రోజుల క్రితమే అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలవాలి అపారనష్టం వాటిల్లింది. రంగాపురంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ధర్మారావుపేటలో రాళ్ల వానకు వరి పంట దెబ్బతిన్నది.
లక్ష్మి మెగా టౌన్షిప్లో..
పోచమ్మమైదాన్ : వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని లక్ష్మి మెగా శనివారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ వైరు తెగింది. కాలనీలోని ఏడో రోడ్డులో రాత్రి వీచిన గాలులకు రెండు విద్యుత్ స్తంభాల నడుమ వైరు తెగింది. అర్ధరాత్రి కావడంతో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వెళ్లిన వారు చూసి ఆందోళన చెందారు. వెంటనే దేశాయిపేట విద్యుత్ అధికారులకు సమాచారం అందించగా కరెంటు సరఫరా నిలిపి, మరమ్మతులు చేపట్టారు. రోడ్డు నంబర్ 3లో రెండు చోట్ల వేపచెట్లు పడిపోవడం, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగాయి.
నెక్కొండ మార్కెట్లో తడిసిన మక్కలు
నెక్కొండ: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు రాత్రి కురిసిన అకాలవర్షానికి తడిసిపోయాయి. కొద్ది రోజుల క్రితమే మక్కజొన్న చేలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. చేతికి అందిన మక్కలను మార్కెట్కు తీసుకువచ్చి, దాదాపు 1500 క్వింటాళ్ల మక్కలను ఎండకు ఆరబోయగా తడిశాయి. టార్పాలిన్ షీట్స్ కప్పినప్పటికీ భారీ వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యాయి.
జిల్లాలో 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం
ఖిలావరంగల్, ఏప్రిల్ 23: వరంగల్ జిల్లాలో సగటు 8.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీవో జీవరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. గీసుగొండలో 14.2 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 10.2, నల్లబెల్లిలో 8.2, నర్సంపేటలో 8.6, ఖానాపూర్లో 11.6, చెన్నారావుపేటలో 9.4, సంగెంలో 5.6, రాయపర్తిలో 1.4, నెక్కొండలో 5, వరంగల్లో 29.2 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.