నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడగా, మిగతా చోట్ల తేలికపాటి వాన కురిసింది. జనగామ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం కురవగా, జనగామ వ్యవసాయ మార్కె ట్, స్టేషన్ఘన్పూర్ మండలం పాంనూర్, రంగరాయగూడెం, నర్మెట మండలం వెల్దండ, హన్మంతాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం బస్తాలు తడిసిపోగా, కుప్పలు పోసిన వడ్లు కొట్టుకుపోయాయి.
అలాగే పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. జనగామ మండలం శామీర్పేట, కమలాపూర్ మండలం ఉప్పులపల్లిలో పిడుగుపాటుకు గేదె, ఆవు మృతి చెందాయి. కాగా, జనగామ వ్యవసాయ మార్కెట్ సహా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసి తరలింపునకు నోచుకోకుండా తడిసిన ధాన్యం బస్తాలను కొర్రీలు లేకుండా మిల్లుల్లో దిగుమతి చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.