మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం కార్మికులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతమైంది. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), బీఆర్ఎస్, కాంగ్రెస్ వాటి అనుబంధ ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ, ఎస్కేఎం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం జేఏసీ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక లోకం కదంతొక్కింది. ఈ సందర్భంగా జిల్లాలు, మండలకేంద్రాల్లో కార్మికులంతా కలిసి ర్యాలీలు నిర్వహించారు. మహబూబాబాద్లో 500 బైక్లతో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. మోదీ ప్రభుత్వం పదేళ్ల నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ యావత్ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్మికులకు కనీస వేతనం ఇవ్వడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేయడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలి స్తానని చెప్పి, మాట తప్పడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్మికులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తీసుకొచ్చిన బీజేపీ సర్కారును గద్దె దించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, దేశంలో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. – నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 16